గోమాత

స్మృతులను పరిశీలించినపుడు ‘గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ’ అని 14 లోకాలూ గోవునం దున్నాయని, గోవునందు దేవతలంద రున్నారని పరాశరస్మృత్యాదులు వివరిస్తున్నాయి. బృహత్పరాశరస్మృతి గోదానాది మహిమ 5-34 నుండి 41 వరకు తెల్పింది. ఇంకా ‘గవాం చైవానుగమనం సర్వపాప ప్రణాశనమ్’ అని గురువువలె గోవు ననుసరించిపోవుట సర్వ పాపహరణ మనికూడా పరాశరస్మృతి చెప్పింది. మనుస్మృతి ‘గవా చాన్న మాఘ్రాతం వర్జయేత్సదా’ అని ఆవు వాసనచూచినా దాని నోటినుండి తీసికొనక దానికే వదలాలని, ‘గవాపహారీ గోధా జాయతే’ అంటే గోవు నపహరించినవాడు ఉడుముగా పుడతాడని చెప్పింది. నృగమహారాజుచరిత్ర ఇందుకు ఉదాహరణగా కన్పడుతుంది. శంఖస్మృతి ‘గోఘ్న శ్చాంధో భవేత్’ ఆవును చంపినవాడు అంధుడగునని చెప్తోంది. ‘గోమయాదినా సంస్కృతాయాం భూమౌ భుంజీత’ అని ఆవుపేడతో శుద్దిచేసినచోట భోజనం చేయమని వ్యాసుడు చెప్పాడు. గోవును కొట్టుట, తన్నుటల వలన మహాపాపం ప్రాప్తిస్తుందనీ స్మృతులు తెల్పాయి.







