Press "Enter" to skip to content

శ్రీ హనుమద్వ్రతము – వ్రత విధానము – హనుమద్వ్రత కథలు – ప్రధమ అధ్యాయము

Suvarchala sahitha Hanuman

మార్గశిర మాసమున శుద్దత్రయోదశి హనుమద్వ్రతము.

మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. ఈ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.

మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్వా దేవీ జనకాత్మజా – మహావీరేణ ధీమతా ||

అని చెప్పబడుటచే ఈ దినముననే హనుమంతుడు సీతాదేవిని చూచినాడు. ఈరోజు హనుమంతుని పూజించినవాని కోరికలు తీరి దుఃఖనివృత్తి అగునని సీతమ్మతల్లి వరమొసగినది.

వ్రత విధానము
ఈ వ్రతమునకు ముఖ్యమయిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. క్రిందటి దినమునుండే వ్రతయత్నములు గావించుకొనుచు శుచియై గడిపి బ్రాహ్మీ ముహూర్తముననే లేచి గురుధ్యానముతోబాటు యథోచిత కృత్యము లొనర్చి వ్రతమునకు సంకల్పింపవలెను.

హనుమంతుడు పంపాతీరమున విహరించుడు కాన ఈ వ్రతమును పంపాతీరముననే కావింపవలెను. అది యందులకు అసాధ్యము కాన పంపాతీరమునకు బదులు పంపాకలశము నేర్పాటుచేసి దాని నారాధించి దాని ప్రక్కనే హనుమద్వ్రతమాచరించినచో హనుమంతుడు పంపాతీరమున వ్రత మాచరించునట్లు సంతసించి యనుగ్రహించును.

వ్రతారంభమునకు ముందుగానే అవసరద్రవ్యములను సమకూర్చుకొనవలెను. పీఠము, పట్టువస్త్రములు, వలయు కలశములు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు షోడశోపచార ద్రవ్యములు, హనుమత్ప్రతిమ, లేదా యంత్రం, పదమూడు ముళ్లుగల తోరము వంటివాని నన్నింటిని సిద్ధము చేసికొని, బంధుమిత్రాదులందరనాహ్వానించి శుచియై వ్రతమునకు సంకల్పింపవలెను.

శ్రీ హనుమద్వ్రత కధలు
ప్రధమ అధ్యాయము

పూర్వము శౌనకాది మహామునులు గంగాతీరమందు ఉన్నవారై జగన్నాథుడు, లక్ష్మీపతి యైన విష్ణువునకు నమస్కరించి పరమ భాగతోత్తముడు, పురాణప్రవచన మొనర్చువాడు అగు సూతుని చూచి అందరు నమస్కరించి వ్రతపరాయణులై ఇట్లు పల్కిరి. “ఓ సూతమహామునీ! విష్ణుగాథను వివరించుఛు నీవు మా కనేక వ్రతములను చెప్పితివి. అట్లే మా కిప్పుడు మరొక్క వ్రతమునుగూర్చి చెప్పవలసినది.”

సూత ఉవాచః
సూతమహాముని ఇట్లనిరి- “ఓ మునులారా! పరమపవిత్రమైనది, నాల్గు వర్ణములవారు అనుష్టింపదగినది, అతి రహస్యమైనది, లోకమందు గొప్ప మంగళప్రదమైనది, ఆయురారోగ్య భోగభాగ్యములను, పుత్రపౌత్రులను కల్గించునది, విద్యాప్రదమైనది యగు శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను వినుడు.

ఒకప్పుడు దయాపూర్ణుడగు వ్యాసభవానుడు తనశిష్యులతో కూడి ద్వైతవనమునకు ధర్మరాజును చూచుటకై హఠాత్తుగా వచ్చెను. ఆ ద్వైతవనము పంచమస్వరం కల కోకిలలతోను, షడ్జస్వరము పలుకు నెమళ్ళతోను మిక్కిలి కూడియున్నది. బాగుగ తెలిసి వేదములనధ్యయన మొనర్చెడి అనేకమంది వేదజ్ఞులతోను, వారి పుత్రపౌత్రగణములతోను కూడి మనోహరమైనది. శాస్త్రవ్యాఖ్యానములతోను, వేదఘోషతోను కూడియున్నది. మహాభాగవత గానముచే హరికథానిలయమైనది. నిత్యము అన్నదానము జరుగునట్టిది. ఆశ్రమము లన్నిటియందు శ్రేష్టమైనదియును. తమ్ములతోను భార్యతోను కూడియున్న ధర్మరాజు నట వ్యాసుడు చూచెను. ఆ ధర్మరాజుకూడ వ్యాసభగవానుడు వచ్చుచున్నాడని విన్నవెంటనే చాలాదూరము సోదరులతోపాటు ఎదురేగి తోడ్కొనివచ్చి ప్రశాంతమగు గృహమున కూర్చుండబెట్టి సేవ లొనర్చెను. ఆ వేదవ్యాసుడు ద్రౌపది చేసిన సేవలకు సంతసించి బృహస్పతి దేవేంద్రుని క్షేమవిచారము చేసినట్లు ధర్మరాజుయొక్క యోగక్షేమములడిగెను.

వేదవ్యాసమహాముని ఇట్లడిగెను. ఓ మహారాజా! ధర్మజా క్షేమముకదా! మహావీరుడైన భీముడు సుఖముగానున్నాడు కాదా! అర్జునుడు, నకుల సహదేవులును క్షేమముకదా! అర్జునుడు పాశుపత మహాస్త్రమును సంపాదించెనుకదా! అని యడిగి యనంతరము, ఓ ధర్మరాజా! సంప్రదాయబధ్ధమైన మిక్కిలి రహస్యమైన వ్రతమొక్కటి కలదు. చెప్పెదను వినుము. ఆ వ్రతము నాచరించినచో నీకు త్వరగా మరల నీ రాజ్యము లభించును. అనగా ధర్మరాజు ఇట్లడిగెను. ఓ మహామునీ! ఆ వ్రతము పేరేమి? ఆ వ్రతమాహాత్మ్య వైభవము లెట్టివి? ఆ వ్రతమునకు దేవత ఎవ్వరు? ఏ మాసమునందు దాని నాచరింపనగును? పూర్వ మెవ్వరావ్రత మాచరించిరి? చెప్పవలసినది. ఆ వ్రతము వెంటనే ఫలితమిచ్చునదైనచో ఇప్పుడే అచరింతును. ఓ మహానుభావా! సహోదరులతో కూడి దుఃఖితుడవైయున్న నా యందట్టి ఆదరము కల మీకంటె నాకు వేరు బంధువులు లేరు. అని ఈ రీతిగా ధర్మరాజు వ్యాసునియందు గౌరవముతో పల్కెను.

అంతట వ్యాసుడు హనుమంతుని మనస్సున పలుమార్లు స్మరించుచు ఇట్లు చెప్పదొడగెను. ఓ రాజశ్రేష్టా! అద్భుతమగు ఆ వ్రతము హనుమద్వ్రతము. దాని నుచ్చరించుటచేతనే నిస్సందేహముచేతనే నిస్సందేహముగా కార్యసిద్ధి యగును. ఆ వ్రతము దుష్టగ్రహములను పారద్రోలునది. మహాజ్వరములను కూడ పోగొట్టునది. పెక్కు మాటలేల? కోరిన కోర్కెలన్నిటి నిచ్చునదిగా తెలయబడుచున్నది. పూర్వము శ్రీకృష్ణభగవానుని ద్రౌవది ప్రార్థించుటవలన ఈ విశిష్టమగు హనుమద్వ్రతము నామెకు తెల్పెను. దాని ప్రభావముననే నీకు సర్వసంపదలు లభించినవి. ఒకప్పుడు ఆ ద్రౌపది కంఠమునందు ఉన్న హనుమద్వ్రత తోరమును చూచి అర్జునుడు ఏమిటి దీనిని ధరించితి వని యడిగెను. ద్రౌపది సుమధురము ఉత్తమము అయిన హనుమద్వ్రతమును గూర్చి తెల్పెను. ఆ మాట విని విధివశమున కోపపూర్ణుడై ఐశ్వర్య గర్వమున అర్జునుడు పౌరుషముగ నిట్లు పలికెను. నా జండాపై కట్టుబడి యుండువాడు, బ్రహ్మచారి, ఆకులు అలములు తిని బ్రతుకువాడు, మృగజాతివాడు, పరాధీనవర్తనుడు అయిన హనుమంతు డేమి ఈయగలడు? మీ స్త్రీజాతి బుద్ధి ఇంతియే. ఇటువంటి వ్రతములతో మమ్ముల మోసగించుచున్నావు.

అనగా నామె దుఃఖించి అర్జునునితో నిట్లనెను. ఓ రాజేంద్ర! ఈ వ్రతము జగన్నాథుడైన శ్రీ కృష్ణునిచేత నాకు చెప్పబడినది. ఆ మహనీయుడు వాసుదేవుడు చెప్పిన వ్రతము నాచరించి ఈ తోరమును ధరించితిని. అనగా అర్జునుడు కోపించి ఓ దుశ్శీలా! నీకు పరిహాసముగా ఈ వ్రతము చెప్పెనేగాని నిజముకాదు. ఆ దుష్టచిత్తుడగౌ కృష్ణుడు నాకు బద్ధుడై దాసునివలె నాయధీనుడుగా నున్న హనుమంతుని పూజ నీ కెందుకు చెప్పెను? భర్తృవాక్యమును వినని నీవు పతివ్రతవు కావు. అది నీకు వ్రతమైనను, వ్రతాంగమైనను ఆ తోరమును తీసివేయవలసినది. అని పల్కుటచే భయమందినదై పతియే దైవముగా కల పతివ్రతయగు ద్రౌపది వ్రతోద్యాపనకు ముందే ఆ తోరము నచ్చట వీడెను. అందువలననే ఓ ధర్మరాజా! మీ యొక్క సకలసంపదల వచ్చిన రీతినే పోయినవి. మీకిట్టి వనవాసక్లేశము సంభవించినది. పదమూడు ముడులుకల తోరమును త్యజించినందుకు ఫలముగా పదమూడేడు లిట్టి కష్టము లనుభవించవలసియున్నది.ఇది యంతయు విని ద్రౌపది ఆ వ్రతవిషయమును జ్ఞాపకము చేసుకొని భర్తలందరి యెదుట ఈ విషయము సత్యమని యప్పుడు చెప్పెను.

అంత వ్యాసుడు ఓ ధర్మరాజా! ఇంకను విననెంచినచో వేరొక గాథ చెప్పెదను. వినుము. పూర్వము శ్రీరాముడు లక్ష్మణునితో కూడినవాడై సీతను వెదకుచు ఋష్యమూకపర్వతము చేరి హనుమంతుని చూచెను. అంత రాముడు సుగ్రీవునితోను హనుమంతునితోను స్నేహము చేసెను. అట హనుమంతుడు రామునితో నిట్లనెను. ఓ శ్రీరామచంద్రా! నీభక్తుడ నైనట్టియు, రామకార్యమున ప్రవేశపెట్టబడనట్టియు నామాటను వినుము. పూర్వము దేవేంద్రుడు వజ్రాయుధముతో నా దవుడను కొట్టెను. ఆనాటినుండి భూతలమున హనుమంతుడనని పేరుగాంచితిని. అప్పుడు మూర్ఛనందిన నన్ను చూచి నా తండ్రియగు వాయుదేవుడు “ఏల నా కుమారుడు పడగొట్టబడినా” డని కోపమువహించి వాయువు వీచకుండ తిరోగమించెను. అ రీతిగా వాయువు లేక ప్రపంచము స్తంభించిపోవుటచే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై ఈ రీతిగా పల్కిరి. ఓ ఆంజనేయ! నీవు చిరంజీవి వగుము.ఆంతులేని పరాక్రమము నంది రామకార్యము లన్నింటిని నెరవేర్చుము. ఓ వానరేశ్వరా! వాయుపుత్రా! హనుమద్వ్రమున నాయకుడవైన నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరు పూజింతురో వారి సర్వకార్యములు నెరవేరును. కార్యార్థయైన రాముడీ వ్రతమును ఆచరింపదగినదని కూడా చెప్పెను. ఆ వాక్యములను ఇప్పుడు గుర్తుతెచ్చుకొనినాను. ఓ రామా! నీవా మాటను తప్పక వినుము. వ్యర్థమగు అలోచన తగదు. దీనిని సత్యముగ నెంచును. నీకు మనసున నచ్చినచో కార్యసిద్ధికై ఆ వ్రతము నాచరింపుము. అని చెప్పి హనుమంతుడు మిన్నకుండగా ఇంతలో హఠాత్తుగా ఆకాశవాణి ‘ఈ చెప్పిన విషయము సత్యమే’ అని పల్కెను. అట్టి ఆకాశవాణిని విని రాముడు సంతసించి అ వ్రత మాచరింపనెంచినవాడై హనుమంతునితో నిట్లు పల్కెను. ఓ హనుమంతా! ఏ రకమైన విధి ఆ వ్రతమునకు కలదు? దాని నెప్పు డాచరించవలెను? చెప్పు మనగా వాయునందను డిట్లు చెప్పదొడగెను.

మార్గశిరమాసమున శుక్లపక్షమున జయప్రదమగు త్రయోదశి యందు పదమూడ ముళ్ళుగల తోరమును పసుపురంగు దానిని కలశము నందుంచి పిదప నా కావాహన మొనర్చి పూజగావింపవలెను. పసుపుపచ్చని గంధము, పుష్పములు, అట్టివే ద్రవ్యములు విశేషించి ముఖ్యమయినవి. “ఓం నమో భగవతే వాయునందనాయ” అను మంత్రము నుచ్చరించుచునే పదమూడు ముళ్ళువేసి ఆ మంత్రముతోనే షోడశోపచార పూజ గావింపదగును. పిదప శ్రోత్రియు డగువానికి ఉపచారములొనర్చి ఉత్తమమగు వాయనమును పదమూడు అప్పములతో నీయవలెను. గోధుమాన్నమును సమర్పింపవలెను. దక్షిణతోకూడ తాంబూలము నర్పించుచు సదాచార సంపన్నులకు అన్నదాన మొనర్పవలెను. ఈ వ్రత ప్రారంభమందే కోరికలు నెరవేరును. దీనిని ప్రయత్నపూర్వకముగా పదమూడేడులు ఆచరింపనగును. దీని ఉద్యాపనము పదమూడు హనుమత్ప్రతిమలతో పూర్తియగును అని మిన్నకుండెను. రాముడు సుగ్రీవునితోను, సోదరునితోను కూడి ఆ వ్రతము నాచరించెను. దానిచే కార్యసిద్ధి చేకూరెను. సుగ్రీవుడును, విభీషణుడును రామోక్తమగు ఆ వ్రతమును యథోచితముగా ఆచరించి సత్ఫలితమందిరి. అప్పటినుండి లోకమునందు హనుమద్వ్రతము ప్రసిద్ధమైనది.

ఈ శుభప్రదమైన వ్రతము నాచరించుటవలన హనుమంతుని సహాయము చేకూరెను. కాన ఓ ధర్మరాజా! నీవుకూడ ఈ వ్రతము నాచరింపదగును. మాసములందు మార్గశిరమాసమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పెను. కావున నీవుకూడ అట్టిమాసమున వ్రత మాచరించిన రాజ్యమును పొందగలవు. అను వ్యాసుని మాటలు విని అందరు సంతసించిరి. ఇంతలో సాయంసమయమై సూర్యుడస్తమించగా ఆ రాత్రి గడిపి ఉదయమే లేచి ధర్మరాజు వేదవ్యాసుని సమ్ముఖముననే సవిస్తరముగా హనుమద్వ్రతము నాచరించెను. ఆ రీతిగా ఈధర్మరాజు హనుమద్వ్రత ఉద్యాపన మాచరించి ఆజ్యసిక్తమైన పాయసముచేత హనుమ న్మూలమంత్రముతో హోమము చేసి వ్రతమును సంపూర్ణమొనర్ఛెను. ధర్మపత్నియగు ద్రౌపదితో సాక్షాత్తుగా హనుమద్వ్రత మాచరించి సంవత్సరము గడువగనే రాజ్యమును పొందగల్గెను. కావున ఓ శౌనకాది మునులారా! వ్రతము లన్నిట శ్రేష్టమైన హనుమద్వ్రతమును మీరుకూడ చేయుడు. అట్లు ఆచరించిన మీరుకూడ సఫలమనోరథులౌదురు అని సూతుడు చెప్పెను. అట్లు వ్రత మాహాత్మ్య మెరిగిన మునులందరు యథావిధిగా మంగళప్రదమగు హనుమద్వ్రత మాచరించిరి.

ఇతి శ్రీహనుమద్వ్రత కథాయాం ప్రథమోధ్యాయః

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: